– ట్రామాకేర్పై కరీంనగర్ మెడికవర్ వైద్యుల అవగాహన సదస్సు
జమ్మికుంట (జూలై 22): రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలైన బాధితులకు అత్యవసర చికిత్స అందించడం ద్వారానే ప్రాణాలను కాపాడే అవకాశాలు ఎంతో మెరుగ్గా ఉంటాయని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే వీలైనంత త్వరగా అన్ని సౌకర్యాలున్న ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయాలన్నారు. బుధవారం జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్ లో అత్యవసర వైద్యం (ట్రామా కేర్) మరియు న్యూరో కేర్ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రో డాక్టర్ దిలీప్ రెడ్డి, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాల్లో తలకు లేదా వెన్నముకకు గాయాలైనప్పుడు బ్రెయిన్ హెమరేజ్ (మెదడులో రక్తస్రావం) అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మల్టీ స్పెషాలిటీ సహా న్యూరో సర్జరీ సదుపాయం ఉన్న ఆసుపత్రికి తరలిస్తే బాధితుడికి సమగ్ర చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం ఎంతో విలువైనదని, సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలే రోగికి పునర్జన్మను ఇస్తాయని తెలిపారు. ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.








