సెప్టెంబర్ 1, 2026 (జమ్మికుంట లోకల్): తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు అరెస్టును బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్ ఠాకూర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం, ప్రశ్నించే బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తోందని విమర్శించారు. నల్లగొండ ఘటనలపై న్యాయం కోసం పోరాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడిని అడ్డుకోవడం కాంగ్రెస్ నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. అరెస్టులు, అక్రమ కేసులతో బీజేపీ కార్యకర్తలను భయపెట్టలేరని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందని రాజేష్ ఠాకూర్ తెలిపారు.








