జమ్మికుంట: అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఒక యువ న్యాయవాదికి ఆలయ ఫౌండేషన్ మానవత్వంతో అండగా నిలిచింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్ గ్రామానికి చెందిన యువ న్యాయవాది వీరవేన కుమార్ గత కొంతకాలంగా అనారోగ్య కారణాల వల్ల రెండు కాళ్లు పక్షవాతానికి గురై ఇంటికే పరిమితమయ్యారు.
వృత్తి రీత్యా న్యాయవాది అయినప్పటికీ, శారీరక ఇబ్బందులు మరియు ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న కుమార్, ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గాదె గుణ సాగర్ను సంప్రదించారు. ఈ విషయాన్ని ఫౌండేషన్ మార్గదర్శకులు, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన చొరవతో తక్షణమే స్పందించారు.
కుమార్ కదలికలకు ఇబ్బంది కలగకుండా ఫౌండేషన్ తరపున ఈరోజు వీల్ చైర్ను అందజేశారు. ఆపదలో ఉన్న తమకు అండగా నిలిచిన పరికిపండ్ల నరహరి మరియు ఆలయ ఫౌండేషన్ సభ్యులకు బాధితుడు కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గాదె గుణసాగర్, నేత అందె కుమార్, జీడి వెంకటస్వామి, మారముల్ల అంజి, వీరవేన సమ్మయ్య, రాజమోహన్, పల్లె బోయిన రాజ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.








